మెడ్రాస్ లో ప్రతి యేడాదీ, మార్గళి నెలలో "డిశంబర్ సీసన్" అని సాంప్రదాయ సంగీత కచేరీలు జఱుగుతూ ఉంటుంది. ప్రపంచ నలుమూలల్నుండీ విద్వాంసులు వచ్చి మైలాపూర్లోని వివిధ సభల్లో సంగీత విందులందిస్తారు. కుదిరినప్పుడూ, ప్రవేశ చీటీలూ(Entry passes) దొరికినప్పుడూ వెళ్ళి సాంప్రదాయ సంగీతం ఆస్వాదించి వచ్చేవాణ్ణి. ఒక కచేరీకి నాకు కొన్ని ప్రవేశ చీటీలు దొరికితే ఒకటి నాకుంచుకుని, మిగిలినవి మిత్రులకిచ్చాను. ఓ స్నేహితుడు చివరి క్షణంలో వెళ్ళలేకపోవడంవల్ల ప్రవేశ చీటి తిరిగిచ్చేశాడు. అప్పుడు మా చెల్లి వస్తానంటే తీసుకెళ్ళాను.
ఆ కచేరీలో గాయని సుబ్రమణ్య భారతి, పాపనాశంశివన్, వేంకటసుబ్బయ్యలు రచించిన అరవ కీర్తనలను భలేగా ఆలపించారు. తెలుగు కీర్తనలు పాడకుంటే ఆ కచేరిని సాంప్రదాయ కచేరీగానే అరవోళ్ళు భావించరు. తెలుగు కీర్తనలు పాడని వారిని విద్వాంసులుగానే అంగీకరించరు. అందువలన తన ప్రతిభను చాటుకునేందుకు 3 తెలుగు కీర్తనలను మధ్యమధ్యలో ఆలపించారు ఆ గాయని.
ఇంటికొచ్చాక, “కచేరి ఎలా ఉనింది? ఏం కీర్తనలు పాడారమ్మా?” అని మా చెల్లిని అడిగారు. చెల్లికి సినిమా పాటలు పరిచయమేగాని సంప్రదాయ కృతులతో, కీర్తనలతో పెద్దగా పరిచయంలేదు. మా ఇంట పుట్టిన దోషంకొద్ది కొన్ని పాపులర్ కృతులవి పరిచయం! అంతే. అరవ, తెలుగు పాటల జాబితా చెప్తూ వచ్చింది. ఒక కీర్తనను చెప్తూ…
“మా జానకి జడబట్టగ మహరాజువైతివి…” అని అమాయకంగా అన్నది.
వినగానే ఇంట్లో అందఱం గట్టిగా నవ్వేశాము. “నీ మొహం, అది జడపట్టగ కాదు, "చెట్టబట్టగ" అంటే, చెయ్యిపట్టుకోగా అని అమ్మ వివరణ ఇచ్చారు. తప్పు మా చెల్లిది కాదు, పాడిన అరవ గాయని ఆ కీర్తనని ఎంతో భావోద్వేగంతో “మా జానకి జడ్డ పట్టక…” అనే పాడారు.
-X-X-X-
ఇది త్యాగరాజస్వాములవారి కృతి. అలమేలుమంగమ్మ ఎలాగైతే తాళ్ళపాకవారింటి ఆడపడుచో అలా, జానకి తిరువారూర్ త్యాగరాజులవారింటి ఆడపడుచు.
మన ఇంటి ఆడపడుచుని ఒకడికిచ్చి పెళ్ళిచేస్తాం. ఆ అల్లుడు పెళ్ళి తరువాత సాధించిన సాధనలన్నిటికీ, "మన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నందువల్ల వచ్చిన అదృష్టం అదంతా" అని మన అమ్మాయి గొప్ప జాతకాన్ని పొగుడుకుని ఆనందిస్తాం. కొంతవఱకు అందులో నిజముండచ్చు. భార్యసహకారంలేకుండా పెళ్ళైన యే మగాడైనా సాధించడం సాధ్యముకాదుకదా!
అలాగే త్యాగరాజుకూడా "రామా మా జానకిని పెళ్ళిచేసుకున్నావు కాబట్టే నీకు ఇన్ని కీర్తులు లభించాయ్, మహరాజువైనావు" అనే రీతిలో పాడుకుని మురిసిపోతున్నాడు. లేకుంటే రామచంద్రుడికి అంత కీర్తి వచ్చేది కాదట. కింద సాహిత్యం చదవండి అర్థం అయిపోతుంది.
========================రాగం : కాంభోజి
రచన : త్యాగరాజు
========================
పల్లవిమా జానకి చెట్టబట్టగ మహరాజు వైతివిరాజరాజ వరరాజీవాక్ష వినురావణారి యన రాజిల్లు కీర్తియుచరణంకానకేగి యాజ్ఞమీరక మాయాకార మునిచి శిఖిచెంతనేయుండిదానవుని వెంటనేచని యశోక తరుమూల నుండివాని మాటలకు కోపగించి కంట వధియించకనే యుండిశ్రీనాయక యశము నీకే కల్గుజేయ లేదా త్యాగరాజ పరిపాల
'రావాణాంతకుడ'నే కీర్తిని నీకు కట్టబెట్టాలని మా సీతమ్మ రావణుణ్ణి తనకంటితో వధించకుండ ఓరుపుతో నీవువచ్చేవరకు ఆగింది. లేకుంటే, అశోకవనంలో చేండాల రావణుడు ఆడిన మాటలువిన్న ఆ ఉత్తరక్షణాన తన కంటిలో కలిగిన అగ్ని చూపులతో అంతం చేసుండేది వాణ్ణి.
ఎంతబాగుందో కదండీ సాహిత్యం?
============================================================
ఈయనకూడా కొన్నిపదాలను సరిగ్గా పలకలేదు!
ఈ కీర్తనలోని అన్ని పదాలనూ సరిగ్గా పలికిన యే గాయకుని పాటా నేనిదివరకు వినలేదు :((
==========================================================
rAgaM : kAMbhOji
rachana : tyAgarAja
========================
pallavi
mA jAnaki cheTTabaTTaga maharAju vaitivi
rAjarAja vararAjeevAksha vinu
rAvaNAri yana rAjillu keertiyu
charaNaM
kAnakEgi yAj~nameeraka mAyAkAra munichi SikhicheMtanEyuMDi
dAnavuni veMTanEchani yaSOka tarumUla nuMDi
vAni mATalaku kOpagiMchi kaMTa vadhiyiMchakanE yuMDi
SreenAyaka yaSamu neekE kalgujEya lEdA tyAgarAja paripAla
===============================================================