27 ఆగస్టు 2012

మగవారింతే.. మారరు!

కొన్ని వేల సంవత్సరాలుగా మకరితో పోరు సాగిస్తున్నాడు కరి రాజు. ఇక తనవల్ల కాదు అనుకున్న క్షణంలో మైండ్ మెసేజింగ్ సర్వీస్(MMS) ద్వారా ఒక్కమారు వేడుకున్నాడు విష్ణుమూర్తిని.
 
మగవారు బయట ఉన్నప్పుడు కొంత సావకాశంగా, తీరిగ్గా ఉంటారేమో గానీ ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చుని ఉంటారాండీ? ఉండాలనుకున్నా ఉండనిస్తారా? ఎన్నిపనులంటగడతారో కదా? పోరాడుతున్న కరికేం తెలుసు ఈ వేళ విష్ణుమూర్తి ఇంట్లో ఏ పనిలో తలమునకలై ఉన్నాడో? తెలియక ఎంఎంఎస్ పంపేశాడు కరి. అందుకోగానే క్షణమైనా ఆలస్యం చెయ్యలేదు హరి. వెంటనే పరుగుతీశాడు కరిని ఆదుకోడానికి.
సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయ సంధింపఁ డే
పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తరధమ్మిల్లుముఁ జక్కనొత్తుఁడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై!
సిరికి చెప్పడు, శంఖమందుకోడు, చక్రం వేలికి తొడగడు, గరుత్మంతుని పిలవడు. విల్లంబులందుకోడు. ఇవన్నీ చెయ్యడానికి ఒక్క క్షణంపడుతుందా? కరి-మకరి యుద్ధం వేలసంవత్సరాలుగా జరుగుతోంది. ఒక్క క్షణం ఆలస్యంగా వెళితే వచ్చే నష్టం ఏంలేదని అతివివేకవంతుడైన విష్ణుమూర్తికి ఎందుకు తోచదు? అట్‌లీస్ట్ శ్రీదేవితో ఒక్కమాట చెప్పి వెళ్ళొచ్చుగా? పైగా తన చేతిలో ఉన్న ఆమె చేలాంచలమైనా వీడకుండా లాక్కుపోయాడట!  కరిరాజును ఆదుకోవడం ముఖ్యమైన పనే. కాదని ఎవరన్నారు? ఎంత ముఖ్యమైన పనైనా సరే, మనసులో కొలువున్న మహరాణికన్నా ఎక్కువా ఆ పని? కాదు.. కానే కాదు. అయినా ఎందుకిలా చేశాడు? అది మగవాడి making లో ఉన్న defect! వాళ్ళ బుర్రలోకి ఏదైనా emergency పని occupy అయితే ఆ పని పూర్తయ్యేవరకు వివేకానికి విరామం ఇచ్చేస్తారు... విల్లునుండి విడువడిన అంబులా ప్రవర్తిస్తారు మగవారు.

పోతన ఎందుకు ఈ మత్తేభాన్ని "సిరికిం జెప్పడు" అని ఆమెతో ఎందుకు మొదలుపెట్టాడూ? మనసిచ్చిన మగువకన్నా ప్రధానమైనది మరొకటిలేదు వివేకమున్న మగవాడికి! అలాంటిది ఆమెకు కూడా చెప్పకుండ(లెక్క చెయ్యకుండ?!) పరుగుతీశాడంటే అది ఏదో ఒక అత్యవసర పరిస్థితి అయ్యుంటుందన్నది గ్రహించండి అని లోకానికీ, మహిళాలోకానికీ.. గట్టిగా చెప్తున్నాడు పోతన.


ఆఫీసునుండి అర్జంట్ అని ఫోన్ వస్తే షర్ట్ బటన్ పెట్టుకున్నాడో లేడో, లేప్టాప్ ఛార్జర్ బేగ్ లో వేసుకున్నాడో లేదో, ఇవన్నీ చేసినా చేయకపోయినా ముఖ్యాతిముఖ్యమైన ఇల్లాలికి "వెళ్ళొస్తానోయ్" అని చెప్పనైనా చెప్పాడో లేదో..  పరుగోపరుగున వెళ్ళిపోతాడు; అది వాడి మేకింగ్ డిఫెక్ట్! ఈ మాత్రం దానికి మీరే కోపశిఖరాలూ ఎక్కకండి. ఆ ఎమర్జెన్సీ అయిపోగానే మొట్టమొదట గుర్తొచ్చేది మీరే గనుక కాస్త సహనం పాటించడం ఉత్తమం అని ఆడువారికి గట్టిగా చెప్పదలచుకున్నాడు కాబట్టే "సిరికిం జెప్పడు.." అని మొదలుపెట్టాడు పద్యాన్ని. విష్ణుమూర్తే అలా చేసినప్పుడు మామూలు మగవాడేం మినహాయింపు కాడు గదా!


"నీ చేలమైనా వీడక పరిగెట్టాను సుమా, అయినా నువ్వు కోపం తెచ్చుకోనే లేదేం!" తాను చేసిన పనికి నొచ్చుకుని శ్రీదేవిని మన్నింపడిగాడు. మగమహరాజులూ వింటున్నారా? సహనం వహించిన సతికి మెచ్చుకోలివ్వడం మరువకూడదన్నమాట. ఆ పై ఆమె దేవర యడుగులు అనుసరించడం తన విధి అని నవ్వుముఖంతో చెప్పనే చెప్పింది. సాదరసరససల్లాప మందహాసపూర్వక ఆలింగనమూ పొందిందట. మగువలూ.. వింటున్నారా?